ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 1,88,021 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.20 అడుగుల మేర నీరుంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీసీఎంసీలు కాగా.. ప్రస్తుతం 200.1971 టీఎంసీల మేర నీరుంది.
శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 1,39,132 క్యూసెక్కులు, పవర్ హౌస్ నుంచి మరో 25,843 క్యూసెక్కులు శ్రీశైలానికి వస్తున్నది. అలాగే, సుంకేశుల నుంచి 23,043 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నది. దాంతో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2,69,321 క్యూసెక్కుల వరద నుంచి సాగర్కు విడుదల చేస్తున్నారు. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 66,102 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. కుడి గట్టు పవర్ హౌస్ ద్వారా 30,787 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు విడుదలవుతోంది.
