- సహకరించాలని మావోయిస్టులకు బహిరంగ లేఖ
- అడ్డుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి
- మావోయిస్టు కుటుంబాలను కలుసుకునే ఆలోచన
- నిజనిర్ధారణ బృందంలో పలు యూనివర్సిటీ విద్యార్ధులు
- హిడ్మా కుటుంబానికి కలువనున్న విద్యార్థి బృందం
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబర్ 18న జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై నిజనిర్ధారణ కోసం యూనివర్సిటీ విద్యార్థుల బృందం వెళుతున్నట్లు ఓయూ విద్యార్ధులు తెలిపారు.
ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశంలో విద్యార్థి ప్రతినిధులు మాట్లాడుతూ గతనెల 18న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడిందన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా, అతని భార్య రాజేతో పాటూ మరో నలుగురు చనిపోయారని పోలీస్ అధికారులు ప్రకటించినప్పటికీ ఆ ఘటనపై అనేక అనుమానాలున్నాయని విద్యార్ధులు ఆరోపించారు.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలో మోస్టు వాంటెడ్గా పేరుగాంచిన హిడ్మా మూడంచల భద్రతా వలయంతో నిత్యం సంచరిస్తుంటాడనీ, అటువంటి వ్యక్తిని చంపడం అంత సులభం కాదని గతంలో అనేకమంది పోలీసు అధికారులు మాట్లాడిన మాటలను విద్యార్థులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
దేశ వ్యాప్తంగా హక్కుల సంఘాలు, పౌర, ప్రజా సంఘాలు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం పెను అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రజాస్వామిక హక్కుల పట్ల, వారి ప్రాణాల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వుందో ఈ ఘటన తేటతెల్లమవుతుందన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వాదుల్లో, ప్రజల్లో భయానక వాతావరణం, గందరగోళం నెలకొన్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వాస్తవాలు వెల్లడికావాల్సిన అవసరం ఎంతైన ఉందనీ, దీనికోసమే తాము నిజనిర్ధారణ కోసం వెళుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.
దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో ఏర్పడిన తమ బృందం డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి 5వ తేదీన సంఘటన స్థలాన్ని సందర్శించడమే కాకుండా మృతిచెందిన మావోయిస్టు కుటుంబ సభ్యులను కూడా కలుస్తామన్నారు.
మావోయిస్టులకు బహిరంగ లేఖ
నిజనిర్ధారణ బృంద సభ్యులు మావోయిస్టులకు బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 4న బయలుదేరే తమ బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. చికిత్స కోసం విజయవాడకు వెళిన హిడ్మా, అతని భార్యతో పాటూ మరో నలుగురిని పోలీసులు పట్టుకొని కాల్చి చంపారన్న అభరు ప్రకటనను ఈ సందర్భంగా ఉదహరించారు. పోలీసులు, ఇటు మావోయిస్టు పార్టీ తమదైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిజాలు తెలిపేందుకే దేశవ్యాపిత విద్యార్థులతో కూడిన తమ బృందం ఈ నిర్ధారణను చేపడుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ, దళిత, బహుజన, వామపక్ష విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు. అయితే డిసెంబర్ 2 నుండి 8 వరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ 25వ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ యాత్రను తలపెట్టడం ఆసక్తికరంగా మారింది.























