ప్రభుత్వ ఉద్యోగాన్ని కొంత మంది అసలు ఉద్యోగంగానే భావించడం లేదు.. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటాం కదా కనీసం బాధ్యతగా ఉందామని కూడా అనుకోవడం లేదు. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధలు నేర్పించి, వారి జీవితాలకు క్రమశిక్షణతో కూడిన బాటలు వేయాల్సింది పోయి.. ఇలా ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. వేలల్లో జీతం తీసుకుంటున్న ఓ టీచరమ్మ.. పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి, క్లాస్ రూమ్లోనే ఫోన్లు వీడియోలు చూస్తూ.. నెత్తికి నూనె పెట్టుకుంటూ.. పైగా పిల్లలతో హెడ్ మసాజ్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఒక టీచర్ విద్యార్థుల ముందు తరగతి గదిలో మొబైల్ ఫోన్లో క్లాసికల్ పాటలు ప్లే చేస్తూ తలకు మసాజ్ చేసుకుంటూ, జుట్టుకు నూనె రాసుకుంది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని తెలిసి ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి కర్రతో కొట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో ఆ టీచర్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మరో విషయం ఏంటంటే.. ఈ టీచరమ్మే ఈ స్కూల్ కు ప్రిన్సిపల్. ఈ విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్రాథమిక విద్యా అధికారి విచారణకు ఆదేశించారు.
