చెన్నై: కులంపేరుతో ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నవారిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుశాఖకు మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అరియలూరు జిల్లా అయ్యనార్ ఆలయంలో దళితులు ఆలయంలోకి వెళ్ళేందుకు అనుమతించడంలేదని వెంకటేశన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. అందులో అరియలూరు జిల్లా ఉడలయార్ పాళయం గ్రామం లో ఉన్న అయ్యనార్ ఆలయంలో దళిత వర్గాలకు చెందిన భక్తులు ప్రతిష్టించిన విగ్రహాలను ఓ వర్గానికి చెందినవారు కూల్చివేశారని, ఆలయంలో స్వామివారి దర్శనానికి దళితులను అనుమతించడంలేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ గ్రామంలో బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో ప్రధానాంశమైన రథోత్సవంలో పాల్గొనకూడదంటూ దళితులకు నిబంధన విధించారని, దీనిపై విచారణ జరిపి తమకు ఆలయ ప్రవేశం కల్పించాల్సిందిగా వెంకటేశన్ న్యాయస్థానానికి విజ్ఞప్తిచేశారు. గురువారం హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. చట్టప్రకారం ప్రభుత్వాలున్న ప్రజాస్వామ్య దేశంలో ఆలయంలో ప్రవేశించేందుకు ప్రతిపౌరుడికి హక్కుందని పలు ఉద్యమాల తర్వాతే ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆలయ ప్రవేశానికి చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. ఈ చట్టాన్ని తప్పకుండా పాటించాల్సిన బాధ్యత అధికారులదేనని గుర్తుచేసిన న్యాయమూర్తి, పిటిషనర్ కోరికపై పరిశీలించి దళితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అరియలూరు జిల్లా ఎస్పీకి, ఆలయ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు.
