న్యూ ఢిల్లీ: ఎంపీ మెడలోని చైన్ను లాక్కెళ్ళిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై తమిళనాడు రాష్ట్రం మైలదుత్తురై కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాణక్యపురి ప్రాంతంలోని మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉదయం 6:15 నుంచి 6:20 గంటల సమయంలో పోలాండ్ ఎంబసీ గేట్-3, గేట్-4 దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు ఎదురుగా స్కూటీపై హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి తన మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఆమె లేఖ రాశారు. పటిష్ఠమైన భద్రత ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
