న్యూఢిల్లీ: శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్ జెట్ విమానంలోకి ఆర్మీ అధికారి హింసాత్మకంగా ప్రవర్తించాడు. పరిమితికి మించి అదనపు లగేజీని విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో స్పైస్ జెట్ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆర్మీ అధికారి హింసాత్మకంగా ప్రవర్తించాడు. నలుగురు స్పైస్ జెట్ సిబ్బందిని దారుణంగా కొట్టాడు. ఒక ఉద్యోగి నేలపై స్పృహ కోల్పోయినప్పటికీ కొట్టడం ఆపలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆయన వద్ద 16 కిలోల బరువున్న రెండు క్యాబిన్ బ్యాగులున్నాయి. కాగా, ఏడు కిలోల పరిమితి కంటే రెట్టింపు లగేజీ ఉండటంతో అదనపు లగేజీకి చార్జ్ చెల్లించాలని స్పైస్ జెట్ సిబ్బంది కోరారు. ఆ ఆర్మీ అధికారి దీనికి నిరాకరించాడు. అలాగే భద్రతా ప్రోటోకాల్ను ఉల్లంఘించాడు. బోర్డింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండా ఏరోబ్రిడ్జిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ఆర్మీ అధికారిని గేట్ వద్దకు పంపారు. అక్కడున్న క్యూ స్టాండ్తో స్పైస్ జెట్ గ్రౌండ్ స్టాఫ్పై దాడి చేశాడు. ఒక ఉద్యోగి స్పృహ కోల్పోయినప్పటికీ కొట్టడం ఆపలేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు సిబ్బందిపైనా ఆర్మీ అధికారి దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, ఒకరికి వెన్నెముక విరిగిందని స్పైస్ జెట్ తెలిపింది.
ఈ సంఘటనపై పోలీసులకు స్పైస్ జెట్ ఫిర్యాదు చేయగా ఆ ఆర్మీ అధికారిపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా ఈ సంఘటనపై స్పందించింది.
