రాధ మరణంపై పోలీపుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి : మావోయిస్టు పార్టీ

Published on 

TS: మావోయిస్టు దళ కమాండర్ రాధ అలియాస్ నీల్సో మరణంపై మావోయిస్టు పార్టీ మరో లేఖను విడుదల చేసింది. రాధ మరణంపై పోలీసుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ ఆంధ్ర -ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో విడుదల చేసిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు.

పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీసులు బంటి రాధను విప్లవ ద్రోహిగా మార్చి కోవర్టు కుట్రలో భాగం చేసి ఆమె మరణానికి కారకులయ్యారని, చివరకు బంటి రాధే తాను చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించడం సరైందని మనస్ఫూర్తిగా అంగీకరించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ‘పోలీసుల కుట్రలో నాలా ఎవరూ ద్రోహిగా మారకూడదని’ విప్లవ శ్రేణులకు ఆమె విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

పోలీసులు రాధ ద్వారా పన్నిన భారీ దాడి పథకాన్ని విఫలం చేయడంతోపాటు అందులో ముఖ్యులైన కొందరు ద్రోహులకు అనివార్య స్థితిలోనే భౌతిక శిక్షలు విధించామని కానీ ఈ వాస్తవాలపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటనలు చేయకుండా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలకు పూనుకున్నారని తీవ్రంగా విమర్శంచారు.

ఆమె కులాన్నీ, జండర్న ఉపయోగించుకొని అవాస్తవాలతో కూడిన నీచమైన ప్రచారానికి పూనుకున్నారని, అందుకు పోలీసులే కొన్ని సంఘాల పేర్లతో పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేసారని, సమస్యను ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలపైకి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకూ, హత్యలకు పాల్పడే పోలీసులకు రాధ కులం, జెండర్ విషయాలను మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు.

ప్రస్తుత వర్గసమాజాన్ని రద్దు చేసి ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవడానికి వీలులేని వర్గరహిత సమాజాన్ని నిర్మించాలనే అత్యున్నత లక్ష్యంతో పార్టీలో చేరి విప్లవోద్యమంలో భాగమయ్యే ఎవరైనా తమ కులం, జెండర్, వర్గ, అస్థిత్వాన్ని రద్దు చేసుకుంటారనేది వాస్తవమని.. కానీ పోలీసులు, వర్గ శతృవులు, కొందరు ముర్ఖులు ప్రతిసారి కులాన్ని ముందుపెట్టి దాన్ని ఆయుధంగా వాడుకొని పార్టీపై దుష్ప్రచారం చేయడం ఎప్పటినుండో చేస్తున్నదేనని ఇప్పుడు కూడా అవే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

బంటి రాధ సమాజంలో పీడిత వర్గ మహిళగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నదని. వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి స్వచ్ఛందంగా పార్టీలో చేరిందని పేర్కొన్నారు.

పార్టీ ఆమెకు విప్లవ సిద్ధాంతాన్నీ, రాజకీయాలనూ, సరైన విప్లవపంథాను బోధించి వర్గపోరాట ఆచరణలోకి దింపింది. సాధారణ సభ్యురాలు స్థాయి నుండి అనతికాలంలోనే నాయకత్వ స్థానంలోకి ఎదిగింది. దీని వెనకా ఆమె పట్టుదల, పార్టీ చేసిన కృషి ఉంది. కానీ అదే సమయంలో విప్లవానికి ఆటంకంగా ఉండే పెరీబూర్జువా భావాలను పార్టీ సరిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ తనను తాను విప్లవ లక్ష్యానికనుగుణంగా తీర్చి మలుచుకోవడంలో పార్టీ అందించిన ఎడ్యుకేషన్‌ను స్వీకరించి తప్పుడు భావాలను సరిదిద్దుకోలేకపోయిందని, ఫలితంగా క్రమంగా రాజకీయ పథనంవైపు అడుగులు వేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆమె కుటుంబ బలహీనతలు పోలీసులు వాడుకొని విప్లవద్రోహిగా మార్చి తను నమ్మిన రాజకీయాలకూ, పీడితవర్గానికి నష్టం చేసే విధంగా దిగజార్చారని…పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించాలని చూసారు. కానీ పార్టీ అప్రమత్తం అవడం వల్ల తమ పథకం విఫలం కావడంతో తేలుకుట్టిన దొంగల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

ప్రజలు, విప్లవాభిమానులలో గందరగోళాన్నీ, అపోహల్ని, అనుమానాలను రేకెత్తించడానికి పోలీసులు పడరానిపాట్లు పడుతున్నారని… పోలీసుల ఈ కుటిల ఎత్తుగడల్ని తిప్పికొట్టి వాస్తవాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పై వాస్తవాలను గ్రహించి రాధ మరణానికి కారణమైన పోలీసులను నిలదీయాలని కోరారు.

పోలీసుల చుట్టివేత వలయాలలో కూడా రాధ శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేసే మా వంతు బాధ్యతను నెరవేర్చడానకే తెలంగాణ సరిహద్దుల్లోని జనసంచార ప్రాంతంలో తన శవాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందని… ఇది నిర్లక్ష్యం కాదు, ఇది మా బాధ్యతగానే చేసామనేది కుటుంబ సభ్యులు గమనించాలని కోరారు. . వీలుంటే మరిన్ని వాస్తవాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form