- తిరుమలలో భక్తురాలిని పాము కాటువేయలేదు
- ఓ ప్రకటనను విడుదల చేసిన టీటీడీ అధికారులు
- ఈ ఘటనలో ఏం జరిగిందో చెప్పిన దంపతులు
AP: తిరుమల క్యూలైన్ లో భక్తురాలు పాము కాటుకు గురి అయినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) రాత్రి స్వామి దర్శనం కోసం టాక్సీలో ఎస్వీ మ్యూజియం వద్దకు వెళ్లారు. ఆర్.బి. సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశ్యంతో మౌనిక కారు నుంచి క్రిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో తాకడంతో ఆమె భయంతో గట్టిగా అరవడంతో, వెంటనే ఆమె భర్త శరత్ బాబు వెతికి చూడగా అక్కడ ఒక పాము పిల్ల కనిపించింది.

వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మౌనికను తిరుమలలోని అశ్విని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. భక్తురాలిని పరిశీలించిన డాక్టర్లు ఆమె పాముకాటుకు గురి కాలేదని నిర్ధారించారు. అయినప్పటికీ భక్తురాలి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా ఆమెను తిరుపతిలోని స్విమ్స్ లో చేర్చడం జరిగింది. స్విమ్స్ డాక్టర్లు కూడా మౌనిక పాము కాటుకు గురికాలేదని తేల్చారు. పైగా విచారణలో అక్కడ కనిపించిన పాము విషరహిత సర్పంగా తేలింది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ సిబ్బంది స్పందించిన తీరుకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలియజేసారు. సోమవారం ఉదయం ఆ దంపతులు స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను భక్తులు నమ్మకండని అధికారులు కోరారు.























