TS: సర్కార్ బడుల్లో విధులకు డుమ్మా కొట్టడం.. ఆలస్యంగా వచ్చే టీచర్లకు భారీ షాకిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. టీచర్ల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కొత్త సిస్టమ్ను అమలు చేయనుంది. అదే ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం(ఎఫ్ఆర్ఎస్). ఆగస్టు 1నుంచి సర్కార్ బడుల్లో దీన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
దీని అమలుకు సంబంధించి ఇప్పటికే జిల్లా ద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఇది ఎంపిక చేసిన పాఠశాలల్లోనే అమల్లోకి వస్తుండగా.. వారం రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.
ఈ విధానంలో ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాల ప్రాంగణం నుంచే వారి హాజరు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం జియో కోఆర్డినేట్ అటెండెన్స్ అమలు కానుంది. దీనిలో భాగంగా టీచర్లు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్కూల్ ఆవరణ నుంచే లాగిన్, లాగౌట్ అవుతూ.. హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల తరచుగా స్కూళ్లకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటికే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ హాజరు ప్రక్రియ అమలవుతుండగా నేటి నుంచి టీచర్లకు కూడా ఇదే విధానంలో హాజరు ప్రక్రియ అమలు కానున్నది.
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల ఆ రోజు క్లాస్కి ఎంత మంది విద్యార్థులు వచ్చారు.. మొత్తం పాఠశాలకు ఎంత మంది హాజరయ్యారు.. ఏ సమయంలో హాజరు తీశారు అనే వివరాలు నేరుగా ప్రభుత్వానికే తెలియనున్నవి. ఈ విధానం అమలు వల్ల మధ్యాహ్న భోజనం నిర్వహణ పారదర్శకంగా అమలు కొనసాగుతుంది.
