చెన్నై: పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది. తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలనసభ అధ్యక్షుడు పచ్చయప్పన్ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లో… తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్గా పనిచేస్తుందన్నారు.
ఈ సభ జెండాను ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు.నిర్ధిష్ట రంగులు వినియోగించే హక్కు తమ సభకు మాత్రమే ఉందన్నారు. కానీ, నటుడు విజయ్ 2024లో ప్రారంభించిన టీవీకే జెండాలో ఎరుపు, పసుపు రంగులున్నాయని, అందువల్ల టీవీకే జెండాలోని రంగులు తొలగించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్కుమార్ రామమూర్తి… ట్రేడ్ మార్క్ సర్టిపికెట్ సరుకులకు మాత్రమే వర్తిస్తుంది. రాజకీయ పార్టీల జెండాలకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించారు. ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ సరుకులకు మాత్రమే కాకుండా సేవలకు వర్తిస్తుందని, స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్ట్లకు కూడా ఈ సర్టిఫికేట్ వర్తిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. అనంతరం న్యాయమూర్తి, ఈ పిటిషన్పై టీవీకే అధ్యక్షుడు విజయ్ అఫిడివిట్ దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసి, విచారణ వాయిదావేశారు.
