TS: ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో మకాం వేయడం చర్చనీయాంశమైంది. కొందరు సీనియర్లు పార్టీని ఎదగనివ్వడం లేదని ఆయన ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతల పై కంప్లైంట్ చేసేందుకే రాజాసింగ్ ఢిల్లీ వెళ్లాడన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ల మీద ఆయన హైకమాండ్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ తెలంగాణ చీఫ్ గా రాంచందర్ రావును నియమించిన నాడే రాజాసింగ్ రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను నాటి బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డికి అందించారు. ఆ లేఖను రాష్ట్ర పార్టీ ఇప్పటికే హైకమాండ్ కు పంపించింది. అయితే.. ఆయన రాజీనామా ఆమోదంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాజాసింగ్ రాజీనామాను కమలం పార్టీ పెద్దలు ఆమోదిస్తారా? లేక ఆమోదించరా? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన రాజాసింగ్.. హైకమాండ్ కు తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరించనున్నట్లు తెలుస్తోంది. హస్తిన పర్యటన పూర్తయిన తర్వాత రాజాసింగ్ అమర్నాథ్ యాత్రకు వెళ్లనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ తెలంగాణ చీఫ్ అధ్యక్షుడు రామచందర్ రావుకు ఎమ్మెల్యే రాజసింగ్ సవాల్ నిన్న విసిరారు. రామచందర్ రావు తాను డమ్మీని కాదు.. మమ్మీనీ.. డాడీని అనే స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామచందర్ రావుకు మంచి అవకాశం దొరికిందన్నారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆయనకు సూచించారు. లీగల్ టీమ్ తో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయన్నారు. పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజ్ కు మరో న్యాయమా? అని హైడ్రాను ప్రశ్నించారు. రంగనాథ్ కు ఫాతిమా కాలేజ్ ను కూల్చడానికి ధైర్యం చాలడం లేదా? అని ప్రశ్నించారు.
