TS: విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విజన్ 2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకున్నది అని విమర్శించారు. మూడు నెలలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడం వల్ల, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గొడ్డుకారం, నీళ్ల సాంబారే భావి భారత పౌరులకు భోజనం అయింది. మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనం అందించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఎక్కడా అమలు కావడం లేదు. తనిఖీలు చేయవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని హరీశ్రావు నిప్పులు చెరిగారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని కోతలు కోసే రేవంత్ రెడ్డీ.. కనీసం విద్యార్థులకు ఒకపూట అన్నం పెట్టే పరిస్థితిలో కూడా లేవా? అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూలు, స్కిల్ యూనివర్సిటీ అని మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటని పరిస్థితి. నీ నిర్లక్ష్యంతో ఒకవైపు గురుకులాల ఖ్యాతిని దిగజార్చావు.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పోగొడుతున్నావు. విద్యాశాఖ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన మంత్రి లేడా. ఇంకెన్నాళ్లు మంత్రి లేని అనాధగా విద్యాశాఖ ఉండాలి? ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి తూట్లు పొడిచి మళ్ళీ విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావా రేవంత్ రెడ్డి. ఢిల్లీ ట్రిప్పులు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, పొలిటికల్ డైవర్షన్లు బందు పెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. విద్యాశాఖపై సమీక్ష చేయండి. మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయండి అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
