శ్రీనగర్: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ – కాశ్మీర్ పోలీసులు లోయ అంతటా తీవ్ర సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉ్రగవాదులను సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు), సానుభూతిపరులు, భారత్ వ్యతిరేక వైఖరీ కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) వి.కె. బిద్రి మీడియాకు వివరించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 90 మంది వ్యక్తులపై కఠినమైన ప్రజా భద్రతా చట్టం (PSA) కింద కేసు నమోదు చేయగా, 2,800 మంది అనుమానిత OGWలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సహకరించారు అనే అనుమానం వున్న అనేకమంది నివాసాలపై సోదాలు నిర్వహించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో జరుగుతున్నాయని, ఇందులో జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, CRPF, ఇతర భద్రతా దళాలు ఉమ్మడిగా పాల్గొంటున్నాయని వివరించారు.
ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పెంచినట్లు, అనుమానితులను ట్రాక్ చేయడానికి డ్రోన్ల వినియోగాన్ని, రాత్రి వేళల్లో నిఘా కోసం నైట్ విజన్ పరికరాలను ఆయా ప్రాంతాల్లో అమర్చినట్లు తెలిపారు. కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో తరచుగా కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్లు (CASOలు) నిర్వహిస్తున్నట్లు, కీలకమైన కూడళ్లలో చెక్పాయింట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అనుమానితుల మధ్య కదలికలను అలాగే కమ్యూనికేషన్ను ట్రాక్ చేయడానికి మొబైల్ ఫోన్ నిఘా కూడా వినియోగిస్తున్నట్లు వివరించారు. శాంతి భద్రతకు ముప్పు కలిగించే ప్రతి అంశాన్ని కఠినంగా తీసుకుంటున్నట్లు, ఏ విషయంలోనూ రాజీ పడకుండా వ్యవహరిస్తునట్లు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
సాధారణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం వున్న అధికారులకు నివేదించాలని విజ్ఞప్తి చేశారు.
