ఢిల్లీ: ఓటిటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అభ్యంతరకర వీడియోలను కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయమంత్రి డా. ఎల్. మురుగన్ లోక్ సభలో వెల్లడించారు.
ఇప్పటివరకు 43 ఓటీటీ వేదికలను బ్లాక్ చేసినట్లు డా. ఎల్. మురుగన్ లోక్సభలో వెల్లడించారు. అశ్లీలత, హింస, సాంస్కృతిక అంశాలపై సున్నితమైన కంటెంట్ను నియంత్రించేందుకు చట్టపరమైన, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే 43 ఓటీటీ ప్లాట్ ఫార్మలను నిషేధించినట్లు పేర్కొన్నారు. ఓటీటీ వేదికలు చట్టవిరుద్ధమైన కంటెంట్ను ప్రసారం చేయరాదని తెలిపారు.
ప్రసారం చేసే కంటెంట్ను వయస్సు ఆధారంగా వర్గీకరించాలని, పిల్లల వయస్సుకు తగని రీతిలో ఉన్న కంటెంట్ ను నియంత్రించేందుకు తగిన రక్షణ చర్యలు, యాక్సెస్ నియంత్రణ చర్యలను అమలు చేయాలని ఓటీటీ వేదికలకు సూచించారు.
చట్టాలను ఉల్లంఘించేలా కంటెంట్ను ప్రసారం చేస్తున్న 43 ఓటీటీలపై సంబంధిత మంత్రిత్వశాఖలతో సంప్రదింపుల అనంతరం నిషేధం విధించినట్లు తెలిపారు. ఓటీటీ యాప్లు, సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.
