సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమధ్యకాలంలో సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సైతం పంచుకుంటున్నారు. అలాగే అటు నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇటీవలే ఆమె నిర్మించిన శుభం సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై టేక్ 20 హెల్త్ వేదికగా అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రంగాలకు చెందిన నిపుణులును ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన జీవితానికి సంబంధించిన పలు అంశాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం బయోహ్యాకింగ్ పై జరిగిన చిట్ చాట్ లో సమంత ఆసక్తికర విషయాన్ని పంచుకుంటున్నారు. తాను ఒక సమయంలో మొబైల్ కు ఎంతగా అడిక్ట్ అయ్యారో చెప్పుకొచ్చారు. ఫోన్ లేకుండా తాను ఉండలేకపోయానని.. అది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లా ఫీలయ్యానని అన్నారు. ఆ అలవాటును తాను ఏ విధంగా అధిగమించారో చెప్పుకొచ్చారు. సమంత మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో మార్పులు చేసుకున్నాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన రొటీన్ ఏర్పాటు చేసుకుని దానిని ఫాలో అవుతున్నాను. అందుకు ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ఫోన్ విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డాను. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు డిజిటల్ డిటాక్స్ ఫాలో అయ్యాను. ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, ఇతరులను కలవకుండా.. ఇలా సుమారు మూడు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాను. అలా కొన్నిరోజులపాటు పాటించిన తర్వాత ఎంతో మారాను అంటూ చెప్పుకొచ్చారు సమంత. ఇన్నాళ్లు ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.
